
జీడిమెట్ల, వెలుగు: తమ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీలతో తిరిగి చెల్లిస్తామంటూ ఆశ చూపిన ఓ సంస్థ జనాలకు టోకరా వేసింది. రూ. వందల కోట్లు దండుకుని బిచాణా ఎత్తేసింది. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు క్యూ కడుతున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ చింతల్లో బాలాజీ, స్వాతి అనే ఇద్దరు కలిసి ది పెంగ్విన్ సెక్యూరీటీస్ సంస్థను స్థాపించారు.
తమ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ వస్తుందని ప్రజలకు ఆశచూపించారు. దీంతో అధిక వడ్డీ వస్తుందని ఆశపడిన వారు రూ.లక్ష నుంచి కోటి వరకూ పెట్టుబడులు పెట్టారు. అయితే, నిర్వాహకులు రాత్రికి రాత్రి బోర్డు తిప్పేసి పరారయ్యారు. బాధితులు జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించారు. శుక్రవారం రాత్రి వరకూ పలువురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూ.6.50 కోట్లు మోసం చేసినట్లు వెల్లడైంది. ది పెంగ్విన్ సంస్థ నిర్వాహకులపై డిపాజిట్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసిశామని పోలీసులు తెలిపారు.